గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. అయితే.. ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగతా బోగీలతో రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించే 7 రైళ్లను బుధవారం రద్దు చేశారు. మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సౌత్ రైల్వే ప్రకటించింది. కాచిగూడ- నడికుడి, నడికుడి- కాచిగూడ, సికింద్రాబాద్ – వరంగల్, వరంగల్ – హైదరాబాద్, గుంటూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – రేపల్లె రైళ్లు రద్దయ్యాయి.

