విద్యావసతుల కల్పన అంటే భవిష్యత్తు తరాల కోసం పెట్టుబడి
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తెలంగాణను పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములుగా, భవిష్యత్తు తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడిగా మాత్రమే చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్ను సీఎం ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు. అంతకముందు సీఎం మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.ప్రైవేటు విద్యా సంస్థలతో పోల్చితే ప్రభుత్వ విద్యాలయాల్లో క్వాలిఫైడ్ టీచర్లు, మంచి వసతులు, మంచి జీతాలు ఉన్నా, ఎందుకు ప్రమాణాలు పెంచలేకపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది చదువుతుంటే, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. అన్నీ వసతులు కల్పిస్తేనే నాణ్యమైన ఫలితాలు వస్తాయన్న ఆకాంక్షతోనే విద్యావస్థను వసతిగృహాలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు.

