దేశంలో ఒక్కొక్కరిపై లక్షా 32 వేల అప్పు : కేంద్రం
దేశంలో ప్రస్తుత తాజా అంచనాల ప్రకారం 142 కోట్ల 9 లక్షల 30 వేలకు పైగానే జనాభా ఉన్నారు. అయితే.. వీరికి ఒక్కొక్కరిపై.. లక్షా 32 వేల 59 రూపాయల చొప్పున అప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో వెల్లడించింది. అయితే.. సొమ్మేమీ.. వ్యక్తిగతంగా ప్రజలు తీసుకున్న అప్పులో.. లేక బ్యాంకులు ప్రజలకు ఇచ్చిన రుణాలో కాదు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి చేసిన అప్పులు. నాటి నుంచి తీసుకుంటున్న అప్పులను దేశంలోని ప్రతి ఒక్కరికీ.. చిన్నా, పెద్దా, పురుషుడు, మహిళ అనే తేడా లేకుండా పంపిణీ చేస్తే.. ఒక్కొక్కరి తలపై 1.32 లక్షల వరకు అప్పు ఉందని ప్రభుత్వం వివరించింది. అయితే.. ఈ సొమ్మును అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకోసమే తీసుకున్నామని కేంద్రం వెల్లడించడం గమనార్హం. అంతేకాదు.. దీనిలోనే రాష్ట్రాలకు కూడా అప్పులు ఇచ్చామని.. కేంద్రం ఒక్కటే ఖర్చు చేయలేదని వెల్లడించింది. ఈ సొమ్మును దేశ అభివృద్ధి కోసం అప్పు రూపంలో ప్రపంచ బ్యాంకు సహా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నట్టు వెల్లడించింది.

