Breaking Newshome page sliderHome Page SliderNational

నవజోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు

చండీగఢ్‌: ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలంటే రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందంటూ పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజోత్ కౌర్ సిద్ధూ ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా ఆదేశాల మేరకు ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ముఖ్యంగా నాయకత్వ ఎంపిక ప్రక్రియపై బాహాటంగా ఆర్థికపరమైన ఆరోపణలు చేయడం క్రమశిక్షణారాహిత్యంగా పార్టీ అధిష్ఠానం పరిగణించింది.

నవజోత్ కౌర్ సిద్ధూ శనివారం విలేకరులతో మాట్లాడుతూ తన భర్త నవజోత్ సింగ్ సిద్ధూ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అయితే, బేషరతుగా ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె పార్టీని కోరారు. ఈ సందర్భంగా ఆమె, “తాము ఎప్పుడూ పంజాబ్ ప్రయోజనాల కోసమే పోరాడతాం. కానీ, సీఎం సీటులో కూర్చోవడానికి ఇవ్వాల్సిన రూ.500 కోట్లు తమ వద్ద లేవు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విలేకరులు మరింత వివరణ కోరగా, ఎవరూ నేరుగా డిమాండ్ చేయలేదని చెప్పినప్పటికీ, “రూ.500 కోట్లు ఇచ్చినవాళ్లే సీఎం అవుతారు” అంటూ మళ్లీ అనడంతో పార్టీలో తీవ్ర వివాదం చెలరేగింది. వివాదం ముదరడంతో నవజోత్ కౌర్ తన వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని వివరణ ఇచ్చినా, “మా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు” అనే భావనతోనే మాట్లాడానని చెప్పినా, పార్టీ అధిష్ఠానం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి సస్పెన్షన్ వేటు వేసింది.