Andhra PradeshNews

40 నియోజకవర్గాల్లో టీడీపీలో కుమ్ములాటలు

Share with

◆టార్గెట్ 2024 దిశగా చంద్రబాబు అడుగులు !
◆ యువతే కీలకమన్న యోచనలో టీడీపీ అధిష్టానం
◆ పూర్ ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు
◆ కేడర్ లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పటిష్టమైన కార్యాచరణ
◆ తండ్రికి అండగా సీన్‌లోకి నారా లోకేష్
◆ 2024లో టీడీపీకి వర్కౌటవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో గెలుపే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరించడమే కాకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై ధ్వజమెత్తుతున్న చంద్రబాబు ఇప్పుడు సంస్థగత మార్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దిద్దుబాట్లతోపాటు కేడర్ లో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు తొలుత తన కార్యాలయం నుంచే ప్రక్షాళన ప్రారంభించినట్లుగా స్పష్టమవుతుంది. యువనేత లోకేష్ పార్టీలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించటమే కాకుండా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న యువనేత లోకేష్ సంస్థాగత నిర్మాణంలో ఉన్న లోపాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇదే సమయంలో గతంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు ముందు ఉంచుతూ కేడర్ కోటరి వ్యవస్థకు చెక్ పడిందన్న సంకేతాలను పరోక్షంగా ఇస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 నియోజకవర్గాల్లో టిడిపిలో ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు గుర్తించిన అధిష్టానం వీటికి చెక్ పెట్టే దిశగా ముందుకు సాగుతుంది. పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అంతర్గత కుమ్ములాటలకు అవకాశం లేకుండా అధినేత ఆలోచనలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ఎన్నికల కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేతలు, కేడర్ సిద్ధంగా ఉండాలని అధిష్టానం వారికి దిశా నిర్దేశం చేస్తుంది. రానున్న రెండు సంవత్సరాలు నియోజకవర్గాల్లో నేతలు పూర్తిగా ప్రజల మధ్య ఉండాలన్న లక్ష్యంతో ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారికి రూట్ మ్యాప్ ను కూడా ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ముందుకు సాగిన వారికి సరైన ప్రోత్సాహం నైతిక స్థైర్యాన్నిస్తూ యువతే కీలకమైన యోచనలో తెదేపా అదిస్టానం ఆ వర్గానికి పెద్దపీట వేస్తుంది. ఈసారి ఎన్నికల్లో 40 శాతం స్థానాలు యువతకు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇంకా యువనేతలకు కూడా తగిన అవకాశాలు కల్పిస్తూ వారిలో అశలు చిగురించేలా అధిష్టానం ముందుకు సాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి చంద్రబాబు తన రూటును, తన వ్యూహాలను మార్చడం ద్వారా 2024 లోఅధికారంలోకి వస్తారా రారా అనేది వేచి చూడాల్సి ఉంది.