భారతదేశం బొగ్గురంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర-కిషన్ రెడ్డి
కోల్కతాలో జరిగిన CIL సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. భారతదేశం బొగ్గురంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని.. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. సీఐఎల్ పోషిస్తున్న పాత్రను అభినందించారు. దేశీయ అవసరాలకు కొత్త బ్లాకులను గుర్తించడం బొగ్గు ఉత్పత్తిని చేపడుతూనే.. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.

తదనంతరం.. GSI ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన.. నేషనల్ ల్యాండ్స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ ను కేంద్రమంత్రి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో.. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కొండప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల జరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ముందుగానే వీటిని గుర్తించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. దేశంలో కాపర్ ఎక్స్ప్లొరేషన్లో పనిచేస్తున్న ఏకైక సంస్థ అయిన HCL రానున్న రోజుల్లో దేశీయ అవసరాలకు తగ్గట్లుగా మరింత ఉత్పత్తిని పెంచడంపై పనిచేయాలన్నారు. రానున్నరోజుల్లో ఆధునిక సాంకేతికను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు.

