సీబీఐ నుండి ఎంపీ అవినాష్ రెడ్డికి పిలుపు
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన అవినాశ్ ను హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో మొదటిసారిగా అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆరోజు ఏకంగా ఆయనను దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. తాజాగా మరోసారి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు వాట్స్అప్ ద్వారా అవినాష్ రెడ్డికి శనివారం నోటీసులు జారీ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు కడప నుంచి హైదరాబాద్ కు బదిలీ అయ్యాక సిబిఐ దర్యాప్తు వేగం పెంచింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఓవైపు సిబిఐ హైదరాబాద్ కేంద్రంగా దర్యాప్తు ముమ్మరం చేస్తే మరోవైపు సిబిఐ కోర్టులో విచారణ కూడా వేగంగా సాగుతుంది.

అందులో భాగంగానే మొదటిసారి ఎంపీ అవినాష్ ను ప్రశ్నించిన సిబిఐ అతని కాల్ డేటాను కీలకంగా పరిగణించింది. ఫోన్ కాల్ జాబితా ఆధారంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిని ఆ ఇంటి మనిషి నవీన్ లకు నోటీసులు ఇచ్చి కడపలో వారిద్దరిని విచారించింది. మరోవైపు కడప జైలులో ఉన్న నిందితులు సునీల్ యాదవ్ ,ఉమాశంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి లతోపాటు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి అప్రూవరుగా మారిన దస్తగిరిలకు హైదరాబాద్ సిబిఐ కోర్టు జారీ చేసిన సమన్లపై ఈ నెల 10వ తేదీన సిబిఐ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరపరచగా కేసును, మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు. సునీల్ యాదవ్ ,ఉమాశంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలు ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో ఉన్నారు.

అదే విధంగా ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్, బెయిల్ పిటిషన్ పై ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ఇద్దరు వ్యతిరేకిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వరుస పరిణామాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ మొదటిసారి విచారించిన తర్వాత చోటు చేసుకున్నవే. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు మరికొందరు కీలకమైన ప్రముఖులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి విచారించేందుకు తాజాగా రెండోసారి నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం మరో సంచలనంగా మారింది. మళ్లీ విచారణకు పిలిచినప్పుడు రావాలని మొదట్లోనే సిబిఐ అధికారులు అవినాష్ కు స్పష్టం చేశారు. కాగా తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ధ్రువీకరించారు.

