Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కాశీ బుగ్గ ఘటన రిపీటయ్యిందో జాగ్రత్త : పవన్ కళ్యాణ్

కాకినాడ : కాశీ బుగ్గ తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు మరోసారి ఎక్కడా జరగకుండా చూసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఇక్కడి ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై పవన్ దిశానిర్దేశం చేశారు.

  • ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలి. అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలన్నారు.
  • క్యూ లైన్ల నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్, ఎస్సీలను ఆదేశించారు.
  • కాకినాడ జిల్లా పరిధిలో పంచారామాలలోని దాక్షారామం, సామర్లకోట ఉన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు పిఠాపురం శ్రీ పాద గయ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు.
  • ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున రద్దీని అంచనా వేసుకోవాలి. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి.
  • శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి.
  • భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలి. క్యూ లైన్లపైనా, ఆలయ పరిసరాల్లోనూ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. భక్తుల రద్దీకి తగిన పారిశుధ్య నిర్వహణను స్థానిక సంస్థల యంత్రాంగం చేపట్టాలి.
  • భక్తుల రద్దీకి తగిన విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలి. రద్దీ సమయాల్లో ఆయా క్షేత్రాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరిస్తూ ప్రమాదాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
  • రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల దగ్గర మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.