కుత్బుల్లాపూర్లో బీసీ ఓటర్లే కీలకం-మన సర్కార్ గ్రౌండ్ రిపోర్ట్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన కుత్బుల్లాపూర్ ఈసారి పోటీ రసవత్తరంగా మారుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్, నిజాంపేట్, రాజీవ్ గృహకల్ప, నిజాంపేట్, సుచిత్ర సెంటర్, కొంపల్లి, జీడిమెట్ల, బౌరాంపేట్, దుండిగల్ మైసమ్మ మండలాలున్నాయి. ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య పోటీ జరగడం విశేషం. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నవారు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనర్హం. గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు విజయం సాధించిన కేపీ వేవేకానంద మరోసారి గులాబీ పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి, కూన శ్రీశైలం గౌడ్ చేతిలో కేపీ వివేకానంద ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత రెడ్డిని ఓడించారు. 2018లో వివేకానంద టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు.

కుత్బుల్లాపూర్ లో 582 పోలింగ్ బుత్ లు ఉండగా, 6,69,253 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 3,51,307 కాగా, మహిళలు 3,17,793, ట్రాన్స్జెండర్ ఓట్లు 153 ఉన్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో బీసీ వర్గాల ఓటర్లున్నారు. ముదిరాజ్ ఓటర్లు 13 శాతం వరకు ఉండగా, ఆ తర్వాత ముస్లింలు 9 శాతం, రెడ్డి 10 శాతం వరకు ఉన్నారు. ఇక కాపులు సైతం ఇక్కడ గణనీయంగా ఉన్నారు. మున్నూరుకాపు, తూర్పుకాపు, కాపులు సుమారుగా 10 నుంచి 15 శాతం వరకు ఉన్నారు. పద్మశాలీలు 5 శాతం వరకు ఉన్నారు. మాల, మాదిగలు 8 శాతం వరకు ఉన్నారు. విశ్వ బ్రాహ్మణులు 4 శాతం, కమ్మలు 3 శాతం ఉండగా.. ఉత్తరాంధ్ర నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న జనాభా కూడా అత్యధికంగా కుత్బుల్లాపూర్లో ఉన్నారు. వారిలో తూర్పుకాపులు, కళింగలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పటయ్యింది. ఈ నియోజకవర్గంలో ఆంధ్రా ప్రాంత నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఎటువైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థికి ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే.

