NewsNews AlertTelangana

కొనసాగుతున్న క్యాసినో ఈడీ విచారణ.. చికోటి ఉక్కిరిబిక్కిరి

Share with

ఈ రోజు క్యాసినో కేసులో ఈడీ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ని ఈడీ అధికారులు అన్ని అంశాలపైనా విచారణ చేస్తున్నారు. విచారణలో చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డికి వరుసగా ప్రశ్నలు  సంధిస్తూ చెమటలు పట్టిస్తోంది ఈడీ. ఈ విచారణలో ముఖ్యంగా ఈడీ గత మూడేళ్ళుగా జరిగిన చీకోటి ఆర్ధిక లావాదేవీలపై  ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించిన బ్యాంక్ ట్రాంజక్షన్స్ సాఫ్ట్ కాఫీలను చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఈడీకి సమర్పించినట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధానంగా ఉన్న క్యాసినో హావాలా డబ్బును ఎలా దేశాలు దాటించారనే దానిపై ఈడీ అధికారులు చీకోటిని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా దాదాపు 4 దేశాల్లో 7 సార్లు జరిగిన క్యాసినో క్యాంప్‌లపై ఈడీ అధికారులు ఆరా తీశారు. బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన క్యాసినో క్యాంప్‌కు ఎవరెవరు హాజరయ్యారనే అంశంపై కూడా చీకోటిని విచారిస్తున్నారు. అంతే కాకుండా విదేశాల్లో నిర్వహించే ఈ క్యాసినో క్యాంపులకు వెళ్ళడానికి బుక్ చేసే ఫ్లైట్ టికెట్లు,హెలికాఫ్టర్ రెంట్, స్టార్ హోటల్‌లో బస చేయడం వంటి కార్యకలాపాలకు అయ్యే ఖర్చుల గురించి కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. చికోటి ప్రవీణ్‌కు హైదరాబాద్‌లో  ఉన్న హావాలా వ్యాపారులతో ఉన్న సంబంధాలు, వారితో జరిగిన హావాలా లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ హావాలా లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అన్నికూడా వారి ఎదుట ఉంచి ఆధారాలతో సహా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ ఈ రోజు సాయంత్రం వరకు కొనసానున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.