అమిత్ షా – జూ.ఎన్టీఆర్ల భేటీ మంచి పరిణామం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడం రాజకీయాల్లో మార్పునకు మంచి నిదర్శనమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ను 25 ఏళ్ళు వెనక్కి నెట్టేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ దగాలు, మోసాలు, వంచించిన అంశాలను ప్రజల ముందు పెడుతున్నామని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని మద్యం ఆదాయంతో నడపాలనుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ నిజాలు మాట్లాడితే మంత్రులు జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ లకు బీపీ పెరిగిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, మైయిన్స్, వైన్స్ మాఫీయా దోపిడీకి పగ్గాలే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

