Andhra PradeshHome Page Slider

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతుల ఆందోళన

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఉద్యమం ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘ధరణికోట నుంచి ఎర్రకోట’ పేరుతో ప్రత్యేక రైలులో రైతులు ఢిల్లీ చేరుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. మూడు రాజధానుల అభివృద్ధి, అమరావతి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతుల ఆందోళనకు టీడీపీ, కాంగ్రెస్‌, జనసేన, సీపీఐ నేతలు మద్దతు తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రేపు, రేపు వివిధ పార్టీల నేతలతో అమరావతి రైతులు సమావేశం కానున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు… అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరిస్తామన్నారు. సోమవారం రాంలీలా మైదాన్‌లో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో రైతులు పాల్గొంటారు. భారతీయ కిసాన్ సంఘ్ తన సమావేశంలో అమరావతి రైతాంగ ఉద్యమాన్ని ప్రత్యేక అజెండాగా చేర్చింది.