రైతన్నతో పాటు నేతన్న కూడా అంతే ముఖ్యం
హైదరాబాద్లో ప్రారంభించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ లో IIHT సంస్థకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు , పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, చేనేత సంఘాల నేతలు, చేనేత కుటుంబీకులు పాల్గొన్నారు. ఈ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని, వెంటనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం ఆదేశాలిచ్చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి రైతన్న ఎంత ముఖ్యమే నేతన్న కూడా అంతే ముఖ్యం. నేతన్న రుణాలు 30 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టయితే వాటిని మాఫీ చేస్తామన్నారు సీఎం. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 63 లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా ఒక్కొక్కరి రెండు మంచి డిజైన్ తో కూడిన నాణ్యమైన చీరలను అందించాలన్నారు. ఏడాదికి 1.30 కోట్ల చీరలను నేతన్నలకు ఆర్డర్ ఇస్తామని.. చేనేతకు చేయూత పథకం కింద రూ.290 కోట్లు సహా నేతన్నల కోసం పెండింగ్ బిల్లులు కలిపి మొత్తంగా రూ. 335 కోట్ల విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీలో తెలంగాణ విద్యార్థులు చదువుకోవాలంటే బయటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులను గమనించి IIHT ని హైదరాబాద్ కు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిసి కోరగా.. రాజకీయాలకు అతీతంగా ఆమోదించారన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించడానికి నాంపల్లిలో ఖాళీగా ఉన్న తెలుగు యూనివర్సిటీ భవనంలో ఈ సంస్థను ప్రారంభిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సంస్థలో చేరిన విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు నెలకు రూ.2,500 చొప్పున స్కాలర్ షిప్ మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

