వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధత్తు ధరలు ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతులకు ఇక పై పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగలేదన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించామని గర్వంగా చెప్పారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం జగన్ ఆలోచనగా తెలిపారు. తొలిసారిగా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ఒక వ్యాపారకేంద్రంగా మార్చామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే CM APP ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులు మంచి ధరలకు పంటలను అమ్ముకోగలుగుతున్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రాల్లో ఈ మద్దతు ధరల ప్రకటన పోస్టర్లను ప్రదర్శిస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

