నేటి నుండి తిరిగి ప్రారంభం కానున్న నారా లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటి నుంచి యథావిథిగా కొనసాగుతుంది. నందమూరి తారకరత్న మరణంతో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఆది, సోమవారాల్లో యాత్రకు విరామం ఇచ్చిన నారా లోకేష్ తారకరత్న అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి యువగళం పాదయాత్రను లోకేష్ కొనసాగించనున్నారు. శ్రీకాళహస్తి నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించి 23 రోజులు పూర్తయింది. ఇప్పటివరకు ఆయన 296.6 కిలోమీటర్ల మేర పాదయాత్రను నిర్వహించారు. మంగళవారం శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి యాత్రను ప్రారంభించి కోబాక వరకు నడక సాగించనున్నారు.


