Breaking NewsHome Page SliderTelangana

పోలీసులకు షాక్‌ ఇచ్చిన కంత్రీ.. పెట్రోలింగ్‌ వాహనం చోరీ…

పోలీసులంటే దొంగలకు భయం లేకుండా పోయింది. పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడు ఓ దొంగ. ఈ ఘటన సూర్యపేట కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్‌ వద్ద పోలీసులు TS09PA 0658 నంబరు కలగిన పెట్రోలింగ్‌ వాహనాన్ని నిలిపి ఉంచారు. వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అటు వెళ్లగా, వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వాహనానికే తాళం ఉండడంతో సులభంగా తీసుకెళ్లిపోయాడు. పోలీసుల కారును ఎవరు టచ్‌ చేస్తార్లే అనే పోలీసుల ధీమాతో కారుకే తాళాన్ని ఉంచేశారు. దీంతో దొంగ పని ఈజీ అయిపోయింది. చక్కగా కారు తాళం తీసుకుని కారుతో సహా అక్కడ నుంచి ఉడాయించాడు.

తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. వెతకటం మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద నిలిపి ఉంచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాన్ని చోరీ చేసిన దొంగ కోదాడ వద్దకు వచ్చేసరికి వాహనంలో డీజిల్‌ అయిపోవడంతో ఆగిపోయింది. దీంతో దొంగ వాహనాన్ని అక్కడే వదిలేశాడు. ఆ దుండగుడు ఎటు వెళ్లాడు అని పరిశీలిస్తున్నారు పోలీసులు. అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.