60 నిమిషాల్లో ఐదు లక్షల టికెట్లు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలుగు ప్రజలు మాత్రమే కాదు దేశ విదేశాల భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచడంతో స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేసిన వెంటనే బుకింగ్ చేసుకున్నారు భక్తులు. కేవలం 60 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లు బుక్ చేసేసుకున్నారు . టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకపోవడంతో కేవలం విడుదల చేసిన గంటలోనే బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా బుకింగ్ సమయంలో జియో మార్ట్ క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించడంతో భక్తులకు బుకింగ్ అవస్థలు తప్పినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.15.20 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
