మొరుగుతూనే ఉంటారు.. వారిని పట్టించుకోవద్దు..
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందనే వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు, వీడియోలు బయటకి రాగానే బీజేపీ ముఖ్య నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఊసే కనిపించట్లేదు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ఉన్నందున పార్టీ నాయకులు ఎవరూ కూడా మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. `అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు, వారిని పట్టించుకోవద్దు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.