Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertTrending Todayviral

పార్లమెంట్ లో గందరగోళం..ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నాలురోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, రభస కొనసాగడంతో వరుసగా గురువారం కూడా సమావేశాలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా నాలుగోరోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్‌సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టారు.
స్పీకర్‌ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సభలో తమ నిరసనలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయితే మధ్యాహ్నం సభ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష సభ్యుల నిరసనల మద్యే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

విపక్షాల ప్రధాన డిమాండ్లు ఇవే :

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.