NationalNews

వచ్చే వారం నుంచి 4 కొత్త బెంచ్‌లు : సీజేఐ డీవై చంద్ర చూడ్

సుప్రీంకోర్టు పని తీరు మరింత సజావుగా సాఫీగా సాగేందుకు వీలుగా నాలుగు అంశాలపై విచారణ చేపట్టేందుకు నాలుగు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్ర చూడ్ తెలిపారు సుప్రీం కోర్టులో కొన్నిరకాల కేసులను మాత్రమే చూడటానికి సరికొత్త బెంచ్‌లను వచ్చే వారం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో నాలుగు ప్రత్యేక బెంచ్‌లు వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవి క్రిమినల్‌ అంశాలు, ప్రత్యక్ష-పరోక్ష పన్నులు, భూ సేకరణ, వాహన ప్రమాదాల క్లెయిమ్‌లు వంటి అంశాలను విచారించనున్నాయన్నారు చంద్రచూడ్. ఓ కేసుకు సంబంధించి అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సీజేఐ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే వారం ఏర్పడే స్పెషల్‌ బెంచ్‌ ఎదుటకు ఆ కేసును తీసుకెళ్లాలని సూచించారు. తనకు తెలిసినంత వరకు జస్టిస్‌ సూర్యకాంత్‌ బెంచ్‌ భూసేకరణకు సంబంధించిన కేసులను విచారిస్తుందని వెల్లడించారు. ఇక ప్రత్యక్ష-పరోక్ష పన్నులకు సంబంధించిన కేసులను బుధ, శుక్రవారాల్లో స్పెషల్‌ బెంచ్‌ విచారించనుంది. ఈ కొత్త బెంచ్‌ల ఏర్పాటుతో పెండింగ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని న్యాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.