NewsTelangana

అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తాం…

భారత్‌ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, కౌలు రైతులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని, రైతుల సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.  రైతుల కోసం ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు. అలాగే కౌలు రైతులను ఆదుకుంటామని భరోసా నిచ్చారు. 

16 రోజుల పాటు రాహుల్‌ గాంధీ పాదయాత్ర తెలంగాణాలో కొనసాగనుంది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్‌ నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిస్తారు. ఉదయం 6 గంటలకు మక్తల్‌లోని కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల సమయంలో మర్రికల్‌లోని మందిపల్లె వద్ద యాత్ర కొనసాగింది. దీంతో ఇవాళ్టి యాత్ర ముగిసింది. రాత్రి మర్రికల్‌లోని యెలిగండ్ల గ్రౌండ్‌లో రాహుల్‌ బస చేస్తారు.