ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఎన్నికల సంఘం స్వీకరించిందని, సకాలంలో సంబంధిత సమాచారాన్ని అందజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 12, 2019 నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ECకి సమర్పించాలని ఎస్బిఐని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ప్రకటన చేశారు. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి SBI అధికారం కలిగిన ఆర్థిక సంస్థ ఒక్కటే. “మార్చి 12 నాటికి SBI డేటాను సమర్పించాల్సి ఉంది. వారు మాకు సకాలంలో వివరాలను అందించారు. నేను తిరిగి వెళ్లి డేటాను పరిశీలిస్తాను. సమయానికి దానిని వెల్లడిస్తాను,” అని ఈసీ విలేకరులతో అన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో రాబోయే లోక్సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ బుధవారం జమ్మూ వచ్చారు. “మేము 2024 లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తాం. జమ్మూ మరియు కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ‘ప్రజాస్వామ్య పండుగ’లో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా అభ్యర్థిస్తున్నాం” అని CEC చెప్పారు. తప్పుడు వార్తలపై రియల్ టైమ్లో స్పందించేందుకు అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా సెల్లను ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పించాలని, కేంద్ర బలగాలను మోహరిస్తామని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో వ్యాలెట్ల ద్వారా ఆన్లైన్ నగదు బదిలీలపై కఠినమైన నిఘా ఉంచబడుతుందని కుమార్ చెప్పారు. 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు జమ్ము, కశ్మీర్లో ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.