జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి-సీఎం రేవంత్
దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారన్నారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా ఉండేవని… దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో శంకుస్థాపన చేశామన్నారు. చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడన్నారు. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. ఆరెస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయన్నారు. లోక్ సభ స్పీకర్గా తెలంగాణ బిల్లును ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా మీరా కుమారిని ఎప్పుడూ గుర్తుచేసుకుంటుందన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒకసారి దొరల చేతిలో ఉంటే.. ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ గారిని అధ్యక్షా అని పిలవాల్సిందేనన్నారు. కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారన్నారు. అసలు ఆ ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని… చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.