News Alert

రైతులకు శుభవార్త… దీపావళిలోగా పీఎం కిసాన్ నిధి

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించామంది. పీఎం కిసాన్ పథకం 12వ విడత రూ.2,000ను అర్హులైన రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టు నరేంద్ర మోదీ సర్కార్ పేర్కొంది. అగ్రి స్టార్టప్, కిసాన్ సమ్మేళన్ రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ప్రభుత్వం ఈ ప్రకటన వెలువరించింది.

ఈ నెల 17వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ రూ. 2వేలను జమ చేయనున్నట్టు కేంద్ర అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఈ పథకానికి సంబంధించిన డబ్బును జమ చేయవచ్చని గతంలో కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా దీపావళికి ముందు ఈ డబ్బును మంజూరు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 31న మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని విడుదల చేశారు. కాగా ఈ పథకం కింద 10కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 20,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.