Andhra PradeshNews

కడపజిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని లింగాల మండలం, పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద శుక్రవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ. 4.1 కోట్లతో నిర్మించిన లేక్‌ వ్యూ రెస్టారెంట్‌, పార్కును, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జెట్టీలను ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో పాంటున్ బోటు (15 కెపాసిటీ),డీలక్స్ బోట్ (22కెపాసిటీ), 6 సీటర్ స్పీడ్ బోట్ ,4 సీటర్ స్పీడ్ బోట్ లు ఉన్నాయి. అలాగే పర్యాటకుల భద్రతా చర్యల్లో బాగంగా  స్టేట్  డిసాస్టర్ రిస్క్యూ (ఎస్ డి ఆర్) బోట్, ఫైర్ సర్వీస్ బోట్ లను,లైఫ్ జాకెట్లను అందుబాటులో వుంచారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లేక్ వ్యూ పాయింట్ వద్ద నుండి రిజర్వాయర్ అందాలను తిలకించారు.

ముందుగా చిత్రావతి  రిజర్వాయర్ లో  పాంటున్ బోటులో ముఖ్యమంత్రి కాసేపు   విహరించారు.చిత్రావతి లేక్ వ్యూ ప్రకృతి అందాలను ఆయన తిలకించారు. ముఖ్యమంత్రి తో పాటు బోటులో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ , రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా, కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు,  ఎస్పీ అన్బు రాజన్, సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఓ.ఎస్.డి సీ.ఎం.ఓ కృష్ణమోహన్ రెడ్డి,  టూరిజం ఎండి కన్నబాబు, పాడ  అనిల్ కుమార్ రెడ్డి, ధర్మవరం ఎమ్యెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.