Telangana

ఆత్మగౌరవానికి… కేసీఆర్ అహంకారానికి మధ్య పోరు

మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో ప్రజా తీర్పుతో టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. మునుగోడులో మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మకాం వేయాల్సిన అవసరం ఏముంది అని ఆయన ప్రశ్నించారు. గ్రామాల వారీగా, కులాల వారీగా డబ్బులు మద్యం, పంచుతూ ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ మునుగోడులో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని తెలిపారు. మునుగోడులో లబ్ది పొందేందుకు కేసీఆర్ కొత్త మండలంతో పాటు గిరిజనబంధు ప్రకటించారని విమర్శించారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీ కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తోక పార్టీలని విమర్శించిన కేసీఆర్ ఓడిపోతామనే భయంతో కమ్యూనిస్టులతో జత కట్టారని అన్నారు.