Andhra PradeshHome Page Sliderhome page sliderTelangana

కేసీఆర్, జగన్ నాపై కుట్రలు చేశారు: వైఎస్ షర్మిల

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేవలం రాజకీయ ప్రత్యర్థి అయినందుకే తన వ్యక్తిగత సంభాషణలను కూడా దొంగచాటుగా విన్నారని, ఇది వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలకు కూడా విఘాతమని ఆమె పేర్కొన్నారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగం నడిచిందని షర్మిల ఆరోపించారు. “ఒక మహిళ అని కూడా చూడకుండా, ఒక రాజకీయ నాయకురాలిగా నా కార్యకలాపాలను అడ్డుకోవడానికి, నా వ్యూహాలను తెలుసుకోవడానికి ఇంత నీచమైన చర్యలకు పాల్పడ్డారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆమె దుయ్యబట్టారు.ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె హితవు పలికారు.తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ కుట్ర పన్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు తక్షణం విచారణను వేగవంతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణకు ఎప్పుడు పిలిచినా తాను హాజరవుతానని స్పష్టం చేశారు.