వివాహంలో కలుషితాహారం..200 మంది అస్వస్థత
వివాహంలో వడ్డించిన విందు భోజనం అతిథులకు అనారోగ్యాన్ని కలిగించింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో ధన్ మండిలోని ఓస్వాల్ భవన్లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో ఆహారం కలుషితమైంది. ఇది తింటున్న సమయంలోనే కొందరికి వాంతులు అయి, స్పృహ తప్పి పడిపోయారు. దీనితో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యం చేయడానికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో ఇతర ఆసుపత్రుల నుండి కూడా వైద్యులను పిలిపించారు. ఈ వివాహంలో 600 మందికి విందు ఏర్పాటు చేయగా, దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆహారపదార్థాలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. ఈ సామూహిక వివాహాల కోసం వివిధ జిల్లాల నుండి వధూవరులు, వారి బంధువులు హాజరయ్యారు.

