ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో షాకింగ్ విషయాలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును బంజారాహిల్స్ పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈకేసులో నిందితుడు ప్రసాద్ గౌడ్ మహారాష్ట్ర నాందేడ్ లో 32 వేలకు తుపాకిని కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రసాద్ గౌడ్తో పాటు అతని స్నేహితులు, డీలర్ సంతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్రామంలో తనను ఒంటరి చేసిన టీఆర్ఎస్ నాయకులను బెదిరించేందుకే గన్ కొనుగోలు చేసినట్లు నిందితుడు ప్రసాద్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ప్రసాద్ ఎమ్మెల్యేను కలవాలని చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించారు. అయితే ప్రసాద్ను చూసిన ఎమ్మెల్యే ఎందుకు వచ్చావని తిడుతూ బయటకు పంపే ప్రయత్నం చేశారు. దీంతో జీవన్ రెడ్డి, ప్రసాద్ గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రసాద్ గౌడ్ ను నెట్టేయడంతో అతని వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన ఆయన సిబ్బందితో కలిసి ప్రసాద్ను నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. గతంలో ప్రసాద్ గౌడ్ మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ఉన్నాడు.