Home Page SliderTelangana

2025, డిసెంబర్ నాటికి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి- మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి నీటి పారుదల శాఖా రూట్ మ్యాప్ రూపొందించుకుందని రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 2025 డిసెంబర్ నాటికి ఆ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ ల పురోగతి తో పాటు నిర్మించాల్సిన ప్రాజెక్టుల పై బుధవారం రోజున జలసౌధలో నీటిపారుదల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అదనపు కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖా సలహాదారు అదిత్యా దాస్, ఇ యన్ సి అనిల్ కుమార్ సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా బేసిన్ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్, ఆర్ బి ఎల్ ఐ యస్, జే. ఎన్.ఎల్.ఐ .యస్, డిండి ఎల్ ఐ యస్, ఏ.యం.ఆర్ యస్ ఎల్ బి సి, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎల్ ఐ సి లతో పాటు గోదావరి బేసిన్ పరిధిలోని చిన్న కాళేశ్వరం, నిల్వాయి ప్రాజెక్ట్,పాలెం వాగు,మత్తడి వాగు,యస్.ఆర్ యస్.పి ఫేజ్ 2, చనాకా కోరాట,లోయర్ పెన్ గంగా, దేవాదుల ,మోదీ కుంటవాగు,యస్.వై.పి ౹౹, జే సీ ఆర్ డి ఎల్ ఐ యస్, సీతారామ ఎల్ ఐ యస్ లపై సమగ్రమైన సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వీటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్ట్ లతో పాటు గోదావరి బేసిన్ పరిధిలోని చిన్న కాళేశ్వరం, మోదీకుంట,లోయర్ పెన్ గంగా, చనాక కోరాట,శ్రీపాద ఎల్లంపల్లి,జే సి ఆర్ డి ఎల్ యస్ తదితరాలు పూర్తి చేసేందుకు 8,000 కోట్ల పై చిలుకు అవుతుందన్న అంచనాకు అధికారులు వచ్చారన్నారు.

అదే సమయంలో 2025 డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలన్న నిర్దేశిత లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకున్న నీటి పారుదల శాఖకు అదనంగా మరో 11 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆర్థిక శాఖాకు పంపాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో 28,000 కోట్లు నీటి పారుదల శాఖకు కేటాయించగా అందులో గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ల నిర్మాణాల పేరుతో చేసిన అప్పులకు కడుతున్న వడ్డియే 18,000 కోట్లు అని మరో రెండు వేల కోట్లు జీత భత్యాలకే ఖర్చు అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అందుకే అదనపు బడ్జెట్ ను సమీకరించుకుని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరు లక్షల పై చిలుకు ఎకరాలు సేద్యంలోకి తేవాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ప్రాధాన్యత క్రమంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించామన్నారు. ఇప్పటికే పూర్తి కావొచ్చిన వాటిని ఏ కేటగిరీలో, ఆ తరువాత బి, ఆ తరువాత సి లుగా విభజించడం జరిగిందన్నారు. ఏ కేటగిరీలో 240.66 కోట్లతో 47,882 ఏకరాల ఆయకట్టును సేద్యం లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అదే విదంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా నిర్మితమౌతున్న ప్రాజెక్టులకు సుమారు 7,500 కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో 5,84,770 ఎకరాల ఆయకట్టు భూమిని సేద్యం లోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. అదే విదంగా నిర్మల్ జిల్లా సదర మాట్ ప్రాజెక్టు ను ఈ నేల చివరి నాటికి,ఖమ్మం జిల్లాలో రాజీవ్ కెనాల్(సీతారాం ప్రాజెక్ట్ )ను ఆగస్టు 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.