చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ డాక్టర్ల కీలక నివేదిక
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తె.దే.పా. అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల కీలక నివేదిక బయటకు వచ్చింది. జైలు అధికారులు, ప్రభుత్వాధికారులు చెబుతున్న దానికి భిన్నంగా డాక్టర్లు నివేదిక ఉంది. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నెల 12న సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్ సూపరింటెండెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షించిన జి.సూర్యనారాయణ, వి.సునీతాదేవీలతో కూడిన డాక్టర్ల బృందం జైలు అధికారులకు నివేదిక అందజేసింది. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వివిధ రకాల మందులను డాక్టర్లు సిఫార్సు చేశారు.
డీహైడ్రేషన్తో గుండెపైనా ప్రభావం పడే అవకాశం.. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లు
రాజమండ్రి ప్రభుత్వ డాక్టర్ల నివేదిక ప్రకారం చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ఆయన వ్యక్తిగత డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. డాక్టర్ల నివేదికను బయటపెట్టకుండా ఇప్పటివరకు అంతా బాగుందంటూ జైలు అధికారులు చెబుతున్నారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా చంద్రబాబును పరీక్షించిన డాక్టర్ల నివేదిక ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్దిరోజులుగా డీహైడ్రేషన్తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకి హైపర్ ట్రోపిక్ కార్డియో మైయోపతి సమస్య ఉందని, ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్తో గుండెపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం, అధికారులు.. చిన్నవి చేసి చూపిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన మరింత పెరిగింది.