Home Page SliderInternational

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు రాజకీయపరంగా సుప్రీంకోర్టులో విజయం లభించింది. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) రిజర్వుడు సీట్లు పొందడానికి అర్హత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాజీ ఫైజ్ ఈసా అధ్యక్షతన 13 మంది సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. దీనితో ఆయనకు భారీ విజయం లభించినట్లయ్యింది. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పీటీఐ వేసిన కేసుపై ఈ తీర్పు వెలువడింది. పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీ గుర్తుపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. దీనితో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసిన గెలుపొందారు. ఎన్నికల అనంతరం వీరు సున్నీ ఇత్తిహాద్ కౌన్సిల్ (ఎస్‌ఐసీ) పార్టీలో కూటమిగా ఏర్పడ్డారు. కానీ వీరికి పార్లమెంట్, ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో ఇవ్వవలసిన రిజర్వుడు సీట్లు కేటాయించలేదు. దీనితో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ తీర్పుతో వారు రిజర్వుడు సీట్ల ద్వారా పార్లమెంట్, ప్రొవిన్షియల్ అసెంబ్లీలో అడుగుపెడతారు. దీనితో ఇమ్రాన్‌కు నైతికబలం పెరిగే అవకాశం ఉంది. ఒక రకంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.