అయోధ్య బాలరాముడికి ప్రాణప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి నిర్యాణం
అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ నేడు ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన కుటుంబ తరతరాలుగా కాశీలో నివసిస్తున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. ఆయన కాశీలో పేరుపొందిన పండితునిగా గుర్తింపు పొందారు. నేడు ఆయన అంత్యక్రియలు కాశీలోని గంగానది చెంత మణికర్ణికా ఘాట్లో నిర్వహించనున్నారు. జనవరి 22న ప్రధాని మోదీ చేతులమీదుగా రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. లక్ష్మీకాంత్ దీక్షిత్ మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.